ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ జోడి

08/06/2012 08:42

 

https://sakshi.com/newsimages/contentimages/08062012/SANIA-bhupati8-6-12-13485.jpgపారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ జోడి సానియా మీర్జా-మహేశ్ భూపతి విజేతగా నిలిచింది. ఫైనల్లో ఏడోసీడ్ సానియా-భూపతి 7-6 (7/3), 6-1తో అన్‌సీడెడ్ క్లౌడియా జాన్స్ ఇగ్నాసిక్ (పోలెండ్)-సాంటియాగో గోంజాలెజ్ (మెక్సికో)పై విజయం సాధించారు. 73 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసెట్‌లో ఓ దశలో 3-5తో వెనుకబడ్డ సానియా జోడి తర్వాత పుంజుకుంది. తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసి ఆపై సర్వీస్‌ను నిలబెట్టుకుని స్కోరును సమం చేసింది. 

సెట్ టైబ్రేక్‌కు దారితీయగా 7-3తో నెగ్గింది. ఇక రెండో సెట్‌లో సానియా-భూపతి జోడికి ఎదురే లేకుండా పోయింది. సానియా కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2009లో భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మిక్స్‌డ్ విజేతగా నిలిచింది. భూపతి కెరీర్‌లో ఇది ఎనిమిదో మిక్స్‌డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్. అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ (2006, 2009), ఫ్రెంచ్ ఓపెన్ (1997, 2012), వింబుల్డన్ (2002, 2005), యుఎస్ ఓపెన్ (1999, 2005)లో మిక్స్‌డ్ టైటిల్స్ గెలిచాడు. గురువారం భూపతి బర్త్‌డే కావడం విశేషం.